
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన అనగానే బౌన్సీ పిచ్లే గుర్తొస్తాయని టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. జనవరి 5న ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ ఆదివారం మీడియాతో మాట్లాడాడు.
దక్షిణాఫ్రికా పిచ్లపై అధిక బౌన్స్ ఆహ్వానించదగ్గ పరిణామమని, అయితే కొకబుర్రా బంతులతోనే అసలైన సవాల్ ఎదురవుతుందని భువీ తెలిపాడు. దీంతో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయడంపైనే దృష్టిపెట్టామని చెప్పాడు. 'దక్షిణాఫ్రికా పర్యటన అనగానే అందరికీ గుర్తొచ్చేవి బౌన్సీ పిచ్లు. అయితే ఆట మొదలయ్యే వరకూ ఎలాంటి పిచ్ ఇచ్చారో మనం ఊహించలేం' అని అన్నాడు.
'ఒకవేళ బౌన్సీ పిచ్ ఇస్తే.. బ్యాట్స్మెన్కి కష్టాలు ఉంటాయి. బౌలర్లు మాత్రం చిన్న సర్దుబాటుతో వికెట్లు తీసే వెలుసుబాటు ఉంటుంది. కానీ.. కోకబుర్రా బంతి 25-30 ఓవర్లు ముగిసే సరికే బౌన్స్ తగ్గుతుంది. అప్పుడు బౌలింగ్ చేయడం ఫాస్ట్ బౌలర్లకి ఓ సవాల్. ఈ సిరీస్లో అలాంటి పరిస్థితులు ఎదురైతే సమర్థంగా అధిగమించేందుకు ఇప్పటి నుంచే భారత బౌలర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు' అని భువీ అన్నాడు.
'జట్టులో అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అత్యుత్తమంగా ఆడితే సిరీస్ గెలిచేందుకు అవకాశం ఉందని మాకు తెలుసు. గత రెండేళ్లుగా మేం అన్ని పరిస్థితుల్లో బాగా ఆడాం. బౌలింగ్ టెక్నిక్స్ను మేం ఒకరితో మరొకరం పంచుకుంటాం. షమి, ఉమేశ్, ఇషాంత్ బంతిని స్వింగ్ చేయడం నా నుంచి నేర్చుకుంటున్నారు' అని తెలిపాడు.
దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్ ఒక్కడే ప్రమాదకారి కాదని అందరూ ప్రమాదకారులేనని భువీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక శనివారం నాడు రెండు సెషన్లలో ప్రాక్టీస్ చేసిన టీమిండియా.. ఆదివారం నాడు తేలికపాటి వర్షం, తేమ, చలిగాలుల కారణంగా ఇండోర్లోనే ప్రాక్టీస్ చేసింది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తొలి టెస్టు జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.