వరుణుడి ముప్పు:
శనివారం చిరు జల్లులు కురవడంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక ఆదివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం 50 శాతం ఉందని తెలిసింది. అయితే సాయంత్రం వరుణుడి ముప్పు తక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. వర్షం ఒకేసారి కాకుండా కాస్త తెరిపినిస్తూ మళ్లీ కురుస్తుండడంతో సిబ్బందికి మైదానాన్ని సిద్ధం చేయడంలో ఇబ్బంది ఎదురవుతోంది. మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది.
ప్రాక్టిస్ సెషన్కు అంతరాయం:
శనివారం వర్షం ఒకేసారి కాకుండా తెరిపినిస్తూ కురుస్తుండడంతో టీమిండియా ప్రాక్టిస్ సెషన్కు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో ఆటగాళ్లు ఇండోర్లో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర ధవన్, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. యువ పేసర్ నవదీప్ సైనీ వారికి బంతులు వేశాడు.
ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు:
ధర్మశాల పిచ్ సహజంగా బ్యాటింగ్ వికెట్. 2015లో ఇక్కడ ఇదే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. కానీ.. భారత్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా తేలిగ్గానే ఛేదించింది. ప్రస్తుతం ఈ వికెట్ పేస్, స్పిన్ బౌలింగ్కు అనుకూలిస్తుందని అంచనా. మంచు ప్రభావం ఉండనుండడంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది.
ధర్మశాలలో దక్షిణాఫ్రికా విజయం:
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎనమిది మ్యాచ్లో భారత్ విజయం సాధించగా.. ఐదు మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఫలితం రాకుండా ఉండడం విశేషం. అయితే ధర్మశాలలో జరిగిన ఏకైక మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలిచింది.