జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు అర్షదీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్ 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55*), శ్రేయస్ అయ్యర్ (52) అర్ధశతకాలతో సత్తాచాటారు.
విజయంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.అయితే సౌతాఫ్రికాను 400 పరుగులలోపు ఎలా కట్టడి చేయాలని తన సహచర ఆటగాళ్లతో చర్చించానని అర్షదీప్ చెప్పాడు. ''ఈ మూమెంట్ను ఎంతో ప్రేమిస్తున్నా.ఇతర మైదానాలతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఊపిరి పీల్చుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. రాణించింనందుకు సంతోషంగా ఉంది. జట్టులో నా పాత్రను ఆస్వాదిస్తున్నా. కేఎల్ రాహుల్కు థ్యాంక్స్ చెప్పాలి. నేను సత్తాచాటాలి అని, అయిదు వికెట్లు పడగొట్టాలని అన్నాడు. తర్వాత మ్యాచ్ల్లో మరింత రాణించడానికి ఫోకస్ పెడతాం''

''అయితే శనివారం నేను, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్ డిన్నర్కు వెళ్లాం. పింక్ జెర్సీలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఎంత ప్రమాదకరంగా ఆడతారనే విషయంపై చర్చించుకున్నాం. ఆ జెర్సీ ధరించాక వారు భారీ సిక్సర్లు బాదుతారని భావించాం. సౌతాఫ్రికాను ఎలా అయినా 400 స్కోరులోపు కట్టడి చేయాలని మాట్లాడుకున్నాం'' అని అర్షదీప్ అన్నాడు.
వరుసగా ఏడు ఓవర్లు వేసిన అర్ష్దీప్ అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు.కానీ మళ్లీ బౌలింగ్కు వచ్చి ఫెలుక్వాయోను ఔట్ చేశాడు.కాగా, ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బ్రస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా రేపు భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఆడనుంది.