తొలి వన్డేలో ఆల్రౌండ్ షోతో సత్తాచాటిని టీమిండియా రెండో మ్యాచ్లో తడబడింది. గబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా సఫారీ బౌలర్ల ధాటికి 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమికి గల కారణాలు వివరించాడు. ''టాస్ గెలిచి ఉంటే బాగుండేది. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం సవాలుగా ఉంది. కానీ మేం కుదురుకునే ప్రయత్నం చేశాం. మరో 50-60 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చేది. మేం బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు 240-250 మంచి స్కోరుగా భావించాం. ఓ బ్యాట్స్మన్ కుదురుకుంటే ఆ స్కోరును సాధించేవాళ్లం. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం'' అని కేఎల్ రాహుల్ అన్నాడు.

టీమిండియా బ్యాటర్లు అప్రోచ్ గురించి రాహుల్ స్పందిస్తూ.. ''జాగ్రత్తగా ఆడాలా, దూకుడుగా ఆడాలా అనేది వ్యక్తిగత ప్రణాళిక. వారికి తగ్గట్టుగా ఆడతారు. జట్టుగా వారిపై మేం నమ్మకం ఉంచాలి. క్రికెట్లో రైటా రాంగా అని ఉండదు. జట్టు కోసం మన విధిని నిర్వర్తించాలి. బౌలింగ్ విషయానికొస్తే.. పిచ్ తొలి పది ఓవర్లకు కలిసొచ్చింది. వారిని ఇబ్బంది పెట్టాం కానీ వికెట్లు తీయలేకపోయాం. కానీ సాధించి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది. ఏం జరిగినా ఆ విషయాన్ని మైదానంలోనే వదిలేస్తాం. తర్వాత మ్యాచ్ గురించి ఫోకస్ పెడతాం'' అని రాహుల్ చెప్పాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో), యువ ఓపెనర్ సాయి సుదర్శన్తో కలిసి (62; 83 బంతుల్లో)ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.వీరిద్దరు మూడో వికెట్కు 68 పరుగులు జోడించారు. కానీ తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు డి జోర్జి (119*; 122 బంతుల్లో), హెండ్రిక్స్ (52; 81 బంతుల్లో) అదరగొట్టారు. తొలి వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది.