దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టీ20, వన్డే మ్యాచ్లను ఘనంగా ముగించింది. పొట్టి ఫార్మాట్ సిరీస్ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఈ సారి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
దానికి తగ్గట్టుగానే వరల్డ్ కప్ అనంతరం స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. మరోవైపు మన ప్రణాళికను చూసి దక్షిణాఫ్రికా కూడా వాళ్ల కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. అయితే టెస్టు సిరీస్ కోసం ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతడు భారత్కు బయల్దేరాడు. ఎమర్జెన్సీకి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు.

కానీ టీమిండియా మేనేజ్మెంట్, బీసీసీఐతో మాట్లాడిన తర్వాత విరాట్ కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లు ప్రిటోరియాలో టెస్టులకు సన్నద్ధమవుతున్నారు. దానిలో భాగంగా మూడు రోజుల ప్రాక్టీస్ గేమ్ను ఆడుతున్నారు. డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే సెంచూరియన్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు కోహ్లి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ టెస్టు సిరీస్కు పూర్తిగా దూరం కానున్నట్లు సమచారం. గాయంతో మూడో వన్డేకు దూరమైన అతడు స్వదేశానికి బయలుదేరనున్నాడు. రెండో వన్డేలో రుతురాజ్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. అతడు శనివారానికి ఇండియాకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లి టెస్టు సిరీస్కు దూరమైతే భారత్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
సఫారీ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించాలంటే విరాట్ కోహ్లి కీలకమని ఇప్పటికే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా దక్షిణాఫ్రికా మాజీలు కూడా ఈ వ్యాఖ్యలు పేర్కొనడం విశేషం. అయితే ఇలాంటి కీలక సమయంలో కోహ్లి భారత్కు తిరిగి బయలుదేరడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.కాగా, డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. కేప్టౌన్లో చివరి టెస్టు జనవరి 03న మొదలవుతుంది.