సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా
సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్లో మొత్తం మూడు సిక్సులు, నాలుగు బౌండరీలు బాదాడు. రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కోహ్లీకి ఇది 11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం.
అఫ్రిది రికార్డుని సమం చేసిన కోహ్లీ
ఈ క్రమంలో కోహ్లీ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది రికార్డుని సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(11 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) అవార్డులను కోహ్లీ సమం చేశాడు. అయితే, ఆప్ఘన్కు చెందిన మహ్మద్ నబీ(12) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో 22వ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సాధించిన హాఫ్ సెంచరీ అతడికి టీ20ల్లో 22వది కావడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ(21) హాఫ్ సెంచరీల రికార్డుని సైతం కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు టీ20ల్లో 50కిపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం. ఈ క్రమంలో క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక క్రికెటర్గా నిలిచాడు.
మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజి
టెస్టుల్లో 53.14గా ఉండగా, వన్డేల్లో 60.31, టీ20ల్లో 50.85గా విరాట్ కోహ్లీ యావరేజి ఉంది. అయితే, కోహ్లీ ఈ ఘనత అందుకోవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని సాధించాడు. కాగా, ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది.
|
కోహ్లీపై అఫ్రిది ప్రశంసల వర్షం
అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి అత్యధిక హాఫ్ సెంచరీలు విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేయగా, అందుకు అఫ్రిది రీట్వీట్ చేస్తూ కోహ్లిని ప్రశంసించాడు. "విరాట్ కోహ్లీ నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు" అంటూ ట్వీట్ చేశాడు.