

హైదరాబాద్: విదేశీ పర్యటనలో భారత్ రెండు టెస్టుల తర్వాత నుంచి విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ సఫారీ గడ్డపై 43 రోజుల్లోనే 800పైకి పరుగులు చేశాడు. ఆఖరి వన్డేలో సైతం 82 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు.
ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌండరీ బాదిన కోహ్లి.. ఈ సిరీస్లో మూడో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా రెండు సిక్సులను ఝుళిపించిన కోహ్లీ సఫారీ జట్టుకు చుక్కలు చూపించాడు.
వన్డేలో కోహ్లికి ఇది 35వ సెంచరీ కాగా.. ఈ టూర్లో దక్షిణాఫ్రికాపై నాలుగో శతకం కావడం విశేషం. ఛేజింగ్లో విరాట్కు ఇది 21వ సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సులు బాదిన కోహ్లి కేవలం బౌండరీలతోనే 80 పరుగులు సొంతం చేసుకున్నాడు. 23వ ఓవర్కే అతని సెంచరీ పూర్తి అయింది. ఆరు మ్యాచ్ల్లోనే మూడు శతకాలు బాదిన కోహ్లి.. సఫారీ గడ్డ మీద అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కెవిన్ పీటర్సన్ రికార్డును సమం చేశాడు.
ఫీల్డర్గానూ కోహ్లి ఖాతాలో మరో రికార్డ్ చేరింది. వన్డేల్లో 100వ క్యాచ్ను అందుకున్న ఆరో భారత ఆటగాడిగా విరాట్ అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్తోపాటు, ఫీల్డ్లోనూ కోహ్లి సెంచరీ కొట్టాడు.
2003 వరల్డ్ కప్లో గంగూలీ సౌతాఫ్రికా గడ్డపై మూడు సెంచరీలు బాదగా.. మరుసటి ఏడాది ఆస్ట్రేలియాలో వీవీఎస్ లక్ష్మణ్ మూడు శతకాలు సాధించాడు. సఫారీ గడ్డ మీద ద్వైపాక్షి సిరీస్లో మూడు శతకాలు బాదిన తొలి భారత బ్యాట్స్మెన్ కోహ్లినే.