రాంచీ: మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత పేసర్ ఉమేష్ యాదవ్ బ్యాట్ ఝుళిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల మోత మోగించాడు. ఉమేష్ కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేసాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐదు సిక్సర్లు స్పిన్నర్ లిండే బౌలింగ్లోనే బాదడం విశేషం. అయితే చివరికి అతని బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. ఆపై భారత్ తన తొలి ఇన్నింగ్స్ను 497/9వద్ద డిక్లేర్డ్ చేసింది.
14 ఏళ్లుగా డేటింగ్.. ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడిన రఫెల్ నాదల్!!
రవీంద్ర జడేజా ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఉమేశ్ యాదవ్.. వచ్చీ రావడంతోనే పరుగుల వరద పారించాడు. జార్జ్ లిండే వేసిన 112 ఓవర్లోని ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఇక లిండే వేసిన 114 ఓవర్ తొలి బంతి, మూడో బంతి, ఐదో బంతిని సిక్స్ కొట్టాడు. ఇదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి.. ఆ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. బంతి గాల్లోకి లేవగా కీపర్ సునాయాస క్యాచ్ అందుకోవడంతో ఉమేష్ చిరునవ్వులు చిందిస్తూ పెవిలియన్ చేరాడు.
ఉమేశ్ యాదవ్ సిక్సర్ల మోతను చూసి డ్రెస్సింగ్ రూంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నవ్వులు పూయించారు. ముఖ్యంగా కోహ్లీ చిందులు వేసాడు. ఉమేశ్ సిక్సర్ కొట్టిన ప్రతిసారి డ్రెస్సింగ్ రూం సహచరులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ఉమేశ్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. ఎంత దూరం వెళ్లిందో చూడండి అంటూ కోహ్లీ సహచరులతో అన్నాడు. ఇక ఉమేశ్ ఔట్ అయి డ్రెస్సింగ్ రూంలోకి రాగానే కోహ్లీ అతని చూస్తూ వావ్ అంటూ అభినందించాడు. కోహ్లీతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది అతన్ని మెచ్చుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన వీడియోలలో పోస్ట్ చేసింది.
31 పరుగులు ఉమేశ్కు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 31 పరుగులు చేసి రెండు ఫాస్టెస్ట్ రికార్డుల్ని ఉమేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్ అగ్రస్థానంలో నిలిచాడు. 9 బంతుల్లోనే ఉమేశ్ 30 పరుగులు చేశాడు. ఇంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్ చరిత్రలో 10 బంతులు, ఆపై ఆడి అత్యధిక స్ట్రైక్రేట్ కల్గిన ఆటగాళ్లలో టాప్లో చోటు దక్కించుకున్నాడు. ఉమేశ్ యాదవ్ 310 స్టైక్రేట్తో అగ్రస్థానంలో ఉన్నాడు.