తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్టుకు సిద్ధమైంది. కేప్ టౌన్లో జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని భారత్ కసిగా బరిలోకి దిగుతోంది. సిరీస్ను 1-1తో సమంగా పంచుకోవాలంటే ఈ మ్యాచ్లో రోహిత్ సేన తప్పక గెలవాల్సిందే. మ్యాచ్ 'డ్రా' గా ముగిసినా సిరీస్ చేజారినట్లే. కాగా, ఈ టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
దక్షిణాఫ్రికా కెప్టెన్గా బవుమా స్థానంలో ఆఖరి టెస్టు ఆడుతున్న డీన్ ఎల్గర్ టాస్కు వచ్చాడు. తొలి టెస్టులో బవుమాకు గాయమైన సంగతి తెలిసిందే. టాస్ అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ.. ''మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్ చాలా బాగుంది. మేం సిరీస్లో మంచి స్థితిలో ఉన్నాం. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ విజయం సాధించకుండా సిరీస్ గెలవడం అసాధ్యం. టీమిండియాపై శుభారంభం చేయడం మాకు చాలా కీలకం. ఇక టెంబా స్థానంలో ట్రిస్టన్, కొయొట్జీ స్థానంలో ఎంగిడీ జట్టులోకి వచ్చారు. పీటర్సన్కు బదులుగా మహరాజ్కు అవకాశం ఇచ్చాం'' అని అన్నాడు.

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ''టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. పిచ్ బాగుంది. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేస్తే వచ్చే సవాళ్లను మేం అర్థం చేసుకున్నాం. సీమర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటాం. గతం గురించి మర్చిపోవడమే చాలా కీలకం. స్కోరుబోర్డుపై సాధ్యమైన పరుగులు, 20 వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. తొలి టెస్టులో ఇది సాధ్యం కాలేదు. కానీ ఈసారి సత్తాచాటుతాం. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. అశ్విన్ స్థానంలో జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ కుమార్ వచ్చారు'' అని రోహిత్ చెప్పాడు.
ముకేశ్ కుమార్ ఈ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. కాగా, తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల నుంచి ఇప్పటివరకు భారత్ సౌతాఫ్రికా పర్యటనకు ఎనిమిది సార్లు వచ్చింది. కానీ ఒకేసారి సిరీస్ను డ్రా గా ముగించింది. ఆ ఘనతను 2011లో ఎంఎస్ ధోనీ మాత్రమే సాధించాడు.