
హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో ఇరు జట్లు పరుగులు తీసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాయి. రెండు టెస్టులు వరుసగా ఓడిపోయి ఇప్పటికే టెస్టు విజయంపై భారత్ ఆశలు వదులుకుంది. ఈ తరుణంలో మూడో టెస్టు అయినా గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో భారత్ యోచిస్తోంది.
మొహం పగిలిపోయేలా దూసుకొస్తున్న బంతి:
ఈ నేపథ్యంలో వాండరర్స్ స్టేడియం వేదికగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్ తొలి రోజు నుంచే విమర్శలు వస్తున్నాయి. అస్థిర బౌన్స్తో బ్యాట్స్మెన్కు కష్టంగా మారిన ఈ పిచ్పై మూడో రోజు కెప్టెన్ కోహ్లి కూడా అసంతృప్తి వ్యక్తంచేశాడు. పిచ్పై డేంజరస్గా కనిపిస్తున్న కొన్ని స్పాట్లను గుర్తించి అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఒక బాల్ స్టంప్ ఎత్తులో మూడో వంతు కూడా లేవకపోగా మరో బాల్ మొహం పగిలిపోయేలా దూసుకొచ్చింది.
కోహ్లీ చేతికి గాయమైంది:
ఇలాంటి బాల్స్తో ఒకసారి విజయ్ పక్కటెముకలకు గాయమైంది. కోహ్లి చేతికి కూడా బలంగా తగిలింది. దీనిపై కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. వెంటనే అంపైర్లు అలీమ్ దార్, ఇయాన్ గూల్డ్ దగ్గరికి వెళ్లి పిచ్పై ఉన్న డేంజరస్ స్పాట్లను చూపించాడు. ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ కూడా పిచ్పై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ పిచ్కు ఒకటి నుంచి వంద రేటింగ్ ఇవ్వాలంటే తాను రెండు కంటే ఎక్కువ ఇవ్వబోనని స్పష్టంచేశాడు.
టెస్టులకు పనికిరాని పిచ్:
నిజానికి తొలి రోజే ఈ పిచ్ తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర విమర్శలు చేశాడు. అసలు ఇది టెస్టులకు పనికిరాదని అతను అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్పై రిఫరీ ఐసీసీకి ఎలాంటి నివేదిక ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.