దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ చివరి పోరుకు సిద్ధమైంది. కేప్టౌన్లో జనవరి 3 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘోరపరాజయాన్ని చవిచూసిన టీమిండియా సిరీస్ను సమం చేయాలంటే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత జట్టు కూర్పుపై మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి. సఫారీ పిచ్పై తేలిపోతున్న ఆటగాళ్లను పక్కనపెట్టి ఇతరులకు అవకాశాలు ఇవ్వాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా గిల్ గురించి మాట్లాడాడు. ''జట్టులో శుభ్మన్ గిల్ స్థానంపై ప్రశ్నలు మొదలయ్యాయి. అంచనాలకు తగ్గట్టుగా గిల్ బ్యాటింగ్ చేయట్లేదు. 20 టెస్టులు ఆడిన తర్వాత కూడా సగటు 30లోనే ఉంటుంది. ఈ విషయం అతడికి కూడా బాగా తెలుసు''

'' అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా జట్టులో ఉంటే అది అదృష్టమే అని చెప్పాలి. కానీ తర్వాత టెస్టులో మాత్రం రాణించకపోతే గిల్ తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తాడు. మిడిలార్డర్లో సత్తాచాటుతున్న సర్ఫరాజ్ ఖాన్ అతిత్వరలోనే టీమిండియా తలుపు తట్టేలా ఉన్నాడు. అలాగే రజత్ పటిదార్కు అవకాశాలు దక్కేలా ఉన్నాయి'' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
ఇటీవల సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గిల్ రెండు ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో రెండు పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతేగాక టెస్టుల్లో ఏవరేజ్ స్కోరు 30 కంటే తక్కువగా 2023ని కూడా ముగించాడు. వరుసగా మూడేళ్ల నుంచి టెస్టుల్లో అతడి సగటు స్కోరు 30 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
మరోవైపు గిల్ ఆడిన గత 10 ఇన్నింగ్స్లో ఒక్కసారే 30కు పైగా పరుగులు సాధించాడు. అది కూడా ఫ్లాట్ పిచ్ అహ్మదాబాద్పై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులోనే. ఈ నేపథ్యంలో నెట్టింట్లో అతడిపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కఠిన పిచ్లపై కాకుండా అహ్మదాబాద్ పిచ్పై మ్యాచ్ను నిర్వహించండి, తిరిగి గిల్ ఫామ్లోకి వస్తాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.