ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన అదే జోరును దక్షిణాఫ్రికాపై కూడా ప్రదర్శించాలనుకుంటే టీమిండియాకు షాక్ తగిలింది. సఫారీ పర్యటనను ఓటమితో ఆరంభించింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వివరించాడు.
''మేం మంచి స్కోరే సాధించాం. కానీ దక్షిణాఫ్రికా తొలి 5-6 ఓవర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ ను వారివైపు తిప్పుకున్నారు. ఇది బ్రాండ్ ఆఫ్ క్రికెట్. మేం దాని గురించే ఆలోచిస్తాం. మైదానంలో శాయశక్తులా గొప్పగా పోరాడమనదే ముఖ్యం. అయితే వెట్ బాల్ తో బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ ఇలాంటి పరిస్థితులు భవిష్యత్ లో కూడా ఎదురవుతాయి. దీన్ని నుంచి మేం ఎంతో నేర్చుకుంటాం''

''ఇక టీమిండియా క్యాంప్ విషయానికొస్తే అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే మా ఆటగాళ్లుకు ఒక విషయం చెప్పా. మైదానంలో ఏం జరిగినా సరే, గ్రౌండ్ లోనే ఆ విషయాన్ని వదిలేయాలని. మూడో టీ20 మ్యాచ్ పై మా ఫోకస్ పెడతాం'' అని సూర్యకుమార్ అన్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (68*), సూర్యకుమార్ యాదవ్ (56) అర్ధశతకాలు సాధించారు. తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను సౌతాఫ్రికాకు 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు.
దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. హెండ్రిక్స్ (49), మార్క్రమ్ (30) రాణించారు. టీమిండియా బౌలర్లలో ముఖేశ్ రెండు వికెట్లు, కుల్ దీప్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. కాగా, సిరీస్ లో ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది.