T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 7 నుంచి అధికారికంగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అన్ని జట్లు తమ సన్నద్ధతను పరీక్షించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా.. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో తన ఏకైక వార్మప్ మ్యాచ్లో తలపడనుంది. 2024 వరల్డ్ కప్ ఫైనలిస్టుల మధ్య జరుగుతున్న ఈ పోరు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కొత్త చరిత్రకు నాంది
రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఓ బలమైన శక్తిగా ఎదిగింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకున్న భారత్.. అదే ఊపును ఈ మెగా టోర్నీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు ఫామ్లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా తుది జట్టులో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలు
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 4న రాత్రి 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ను లైవ్ చూడాలనుకునే క్రికెట్ ప్రేమికులు 'స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్' ఛానెళ్లలో వీక్షించవచ్చు. మొబైల్ వినియోగదారుల కోసం 'జియో హాట్స్టార్'యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రపంచకప్లో కొన్ని వార్మప్ మ్యాచ్లకు మాత్రమే లైవ్ టెలికాస్ట్ సదుపాయం ఉండగా.. అందులో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ ఉండటం విశేషం.
భారత్ ముందున్న అరుదైన రికార్డులు
ఈ సారి టీ20 వరల్డ్ కప్లో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ జట్టు కూడా సొంత గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఈసారి భారత్ ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాలని పట్టుదలతో ఉంది.
ఈ వార్మప్ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్ తన అసలైన ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే తొలి లీగ్ మ్యాచ్తో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మహా సమరం ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తామంటున్న నేపథ్యంలో ఈ వార్మప్ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరిగింది.