జొహానెస్బర్గ్ వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తలపడనున్నాయి. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో సఫారీ సేన విజయం సాధించింది. పొట్టి సిరీస్ను 1-1తో సౌతాఫ్రికాతో పంచుకోవాలంటే సూర్యకుమార్ సేన ఇవాళ తప్పక గెలవాల్సిందే.
అయితే టీమిండియా మేనేజ్మెంట్ సిరీస్ ను కాపాడుకోవడంతో పాటు టీమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. వచ్చే ఏడాది జూన్ వెస్టిండీస్-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీ ముందు భారత్ ఇవాళ మ్యాచ్ తో కలిపి మరో నాలుగు మ్యాచ్ లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ అంచనాకు రావాలని ప్రయత్నిస్తోంది.

ఇక మూడో టీ20లో సౌతాఫ్రికా కంటే టీమిండియానే ఫేవరేట్ గా ఉంది. సఫారీ పేసర్లు కొయెట్జీ, జేన్సన్ ఆఖరి మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు. దీంతో తక్కువ అనుభవం ఉన్న పేసర్లు వారి తరపున బరిలోకి దిగనున్నారు. అయితే మన బౌలర్లు సిరాజ్, ముకేశ్ కుమార్ గత టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
టీమిండియా తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో వరల్డ్ నంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. శుభ్మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఆడే అవకాశం కూడా ఉంది.
అయితే ఇవాళ కూడా వర్షం పడే అవకాశాలు లేకపోలేదు. కానీ మ్యాచ్ పూర్తిగా జరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఇక పిచ్ విషయానికొస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే పేసర్లుకు కూడా కలిసొస్తుంది. బంతి బౌండరీకి త్వరగా చేరుతుంది. ఈ మైదానంలో భారత్ 10 మ్యాచ్ లు ఆడగా 5-5తో గెలిచింది. ఇక టీ20 ఫార్మాట్ లో మెరుగైన రికార్డు ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 3-1తో మంచి రికార్డు ఉంది.
భారత తుది జట్టు(అంచనా):
శుభ్మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్/ కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్.