టీ20 ప్రపంచకప్ నకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి, టీమ్ కాంబినేషన్ గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు టీ20ల సిరీస్ కు సిద్ధమయ్యాయి. అయితే డర్బన్ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ సెయింజ్ జార్జ్ పార్క్ వేదికగా ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది.
వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న పొట్టి ప్రపంచకప్ కు ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం. యువ ప్లేయర్లను పరిశీలించడానికి ఇది చక్కని వేదిక. అంతేగాక మెగాటోర్నీకి ముందు ఇరు జట్లుకు మరో అయిదు మ్యాచ్ లే మిగిలి ఉన్నాయి. సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లతో టీమిండియా తలపడనుండగా.. మరోవైపు ఇండియాతో పాటు వెస్టిండీస్ తో దక్షిణాఫ్రికా మిగిలిన మ్యాచ్ లు ఆడనుంది.

ప్రపంచకప్ ఓటమి అనంతరం సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా యువ జట్టు ఆస్ట్రేలియాను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది. ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. అంతేగాక సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చేరడం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుంది.
మరోవైపు బవుమా గైర్హాజరీలో దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలను మార్క్రమ్ అందుకున్నాడు. డికాక్,డసెన్, రబాడ, నోర్జె, ఎంగిడీ లేకపోయినా జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. సఫారీ యువ ప్లేయర్లు మాథ్యూ బ్రీట్జ్ కే, బర్గర్ ఇవాళ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇవాళ మ్యాచ్ కు కూడా వరుణుడి ముప్పు ఉంది. మధ్యాహ్నం వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాగా సెయింట్ జార్జ్ పార్క్ లో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలు సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్టు ఒక్కసారి విజయాన్ని అందుకుంది. పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ కు తటస్థంగా ఉంటుంది.
ఇక సౌతాఫ్రికాతో జరిగిన గత నాలుగు టీ20 సిరీస్ లో టీమిండియా రెండు సార్లు విజేతగా నిలిచింది. మరో రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. 2015లో జరిగిన టీ20 సిరీస్ విజయమే టీమిండియాపై దక్షిణాఫ్రికాకు ఆఖరిది. ఆ తర్వాత భారత్ దే పైచేయి.