
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అద్ఫుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ దూకుడుగా ఆడుతూ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
ఈ పర్యనటలో భాగంగా ధావన్ తన కుటుంబాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాడంట. సాధారణంగా ఆట నుంచి విరామం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అయితే, సుదీర్ఘమైన సఫారీ పర్యటనలో ధావన్ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాడు.
ధావన్ మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు.. మంచి భర్త, తండ్రి అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధావన్ ట్విట్టర్ వేదికగా తన కుటుంబసభ్యుల ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. 'కుటుంబం నుంచి ఎక్కువకాలం దూరంగా ఉన్నప్పుడే వాళ్లని ఎంతగా మిస్ అవుతున్నారో తెలుస్తోంది. నా పిల్లలతో కలిసి గడిపే సమయాన్ని, వాళ్ల కోసం అక్కడ ఉండటాన్ని నేను మిస్ అవుతున్నా.. అందరికంటే ఎక్కువగా నా భర్యని మిస్ అవుతున్నా. తిరిగి వెళ్లగానే వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడుపుతా.. మీ అందరిని చాలా ప్రేమిస్తున్నా' అని ట్వీట్ చేశాడు.