42 నంబర్ జెర్సీతో బరిలోకి
రెండో టి20 మ్యాచ్లో శిఖర్ ధావన్ జెర్సీ నంబర్ మారింది. ఈ మ్యాచ్ ముందువరకు ధావన్ జెర్సీ నంబర్ 25. దానిని అదృష్ట సంఖ్యగా భావించి అతడి ట్విట్టర్ ఖాతాకు కూడా 'Sdhawan 25'గా పెట్టుకున్నాడు. అయితే ఉన్నటుండి గత రాత్రి జరిగిన మ్యాచ్లో మాత్రం 42 నంబర్ జెర్సీతో బరిలోకి దిగాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జెర్సీ నెంబర్ మారగానే ధావన్ పరుగులు చేయడం విశేషం.
సంఖ్యాశాస్త్రం పాటిస్తున్నాడా?
శిఖర్ ధావన్ ఇప్పటికే టెస్టు జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక వేలి గాయంతో వన్డే ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల ముగిసిన విండీస్ టూర్లో జరిగిన మూడు టీ20ల్లో 27 పరుగులు మాత్రమే చేసి పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది 7 టీ20 మ్యాచ్లాడిన శిఖర్ ధావన్ 105 పరుగులు చేసాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అతని స్థానంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అదృష్టం మార్పును కోరుకుంటూ.. ధావన్ ఏదైనా సంఖ్యాశాస్త్రం ప్రకారం 42కు మారినట్లుగా అభిమానులు జోకులు పేల్చుతున్నారు.
ఒంటి చేత్తో క్యాచ్:
లక్ష్య ఛేదనలో ధావన్ ఇచ్చిన క్యాచ్ను డేవిడ్ మిల్లర్ అద్భుతంగా అందుకున్నాడు. శంసి బౌలింగ్లో ధావన్ ముందుకు వచ్చి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద ఏ మాత్రం అవకాశం లేని చోట మిల్లర్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ధావన్, కోహ్లీ ఒకరికొకరు చూసుకుంటూ.. ఏం క్యాచ్ పట్టాడు అన్నట్టు ఎక్సప్రెషన్స్ పెట్టారు. ధావన్ 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.