
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో నెట్ ప్రాక్టీస్ చేసేందుకు గాను నాణ్యమైన నెట్ బౌలర్లు లేరని టీమిండియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు బౌలర్లను దక్షిణాఫ్రికాకు పంపించాల్సిందిగా జట్టు మేనేజ్మెంట్ బీసీసీఐని కోరింది.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఠాకూర్తో పాటు ఢిల్లీకి చెందిన నవ్దీప్ షైనీలకు దక్షిణాఫ్రికా రావాల్సిందిగా పిలుపు వచ్చింది. వీరిద్దరూ శనివారం రాత్రి జొహన్నెస్బర్గ్ బయల్దేరనున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్సీఏ) సంయుక్త కార్యదర్శి ఉన్మేష్ తెలిపారు.
ఇప్పటికే టీమిండియాకు దక్షిణాఫ్రికాలో ఐదు పేసర్లు అందుబాటులో ఉన్నారు. అయితే ఇప్పుడు శార్దూల్ను పిలిపించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టెస్టు సిరిస్ అనంతరం దక్షిణాఫ్రికాతో జరగనున్న ఆరు వన్డేలు, మూడు టీ20ల పరిమిత ఓవర్ల సిరిస్కు గాను శార్దూల్ ఠాకూర్ ఎంపికైన సంగతి తెలిసిందే.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 24న జోహెన్స్ బర్గ్ వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందుగానే అంటే ఆదివారం శార్దూల్ ఠాకూర్, షైనీలు జొహెన్నెస్బర్గ్ చేరుకోనున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వీరిద్దరూ నెట్స్లో కోహ్లీసేనకు బంతులు వేయనున్నారు.
మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరిస్ కోసం జనవరి 24న ధోనీతో పాటు మరికొందరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు బయల్దేరనున్నారు. వన్డే సిరీస్కు ముందుగా దక్షిణాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈసారి ఆటగాళ్లను ముందుగానే అక్కడికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది.