
రాంచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. రాంచీ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. ఎంఎస్ ధోనీ స్వస్థలం రాంచీ కాబట్టి.. తొలి రోజే మ్యాచ్కు హాజరవుతాడని అందరూ ఊహించారు. కానీ.. మంగళవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానంకు వచ్చాడు.
ధోనీ రాగానే మైదానం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఫాన్స్ ధోనీ.. ధోనీ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక ధోనీ టీమిండియా డ్రస్సింగ్ రూమ్కు చేరుకున్నాడు. అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు సభ్యులతో చాలా సమయం గడిపాడు. రవిశాస్త్రితో కలిసి ధోనీ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఝార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్తో ధోనీ ప్రత్యేకంగా ముచ్చటించాడు. దీనికి సంబందించిన పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ధోనీ, నదీమ్లు రాంచీ క్రికెట్ జట్టులో సభ్యులు. అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారా అని అంతా అనుకుంటున్నారు. ధోనీ తనతో ఏం మాట్లాడాడో షాబాజ్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. 'మ్యాచ్ తర్వాత ధోనీని కలిసా. భాయ్ ఎలా ఆడాను? అని అడిగితే.. షాబాజ్ నీ బౌలింగ్ చూశా. బౌలింగ్లో ఎంతో పరిణితి సాధించావ్' అని అన్నాడు. 'దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం ఇక్కడ పని చేసింది. బౌలింగ్లో ఎక్కువ ప్రయోగాలు చేయకు. ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడు. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని అన్నాడు' అని షాబాజ్ తెలిపాడు.
'భుజం నొప్పి కారణంగా కుల్దీప్ యాదవ్ స్థానంలో సెలెక్టర్లు నన్ను ఎంపిక చేశారు. మెనేజ్మెంట్ పిలుపుతో కేవలం 24 గంటల వ్యవదిలోనే కోల్కతా నుంచి రాంచీకి బయలుదేరా. నా ఆటతీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నా. ఇదే ఆటతీరును భవిష్యత్తులో కొనసాగిస్తా. ధోనీ ఓ దిగ్గజంగా ఎదిగినా.. ఎటువంటి గర్వం లేకుండా ఉంటాడు' అని షాబాజ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో నదీమ్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టి అందరిని ఆచ్చర్యపరిచాడు.