
ఆత్మవిశ్వాసంతో భారత్
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ సిరీస్లో 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో నేటి నుంచి జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనున్న మ్యాచ్లో టీమిండియా తొలి మ్యాచ్లో గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్లో రాణించిన బౌలింగ్ దళం, ఈ మ్యాచ్లోనూ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ బౌలర్లతో టీమిండియా పేస్ దళం బలంగా ఉంది. వీరికి తోడు మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ రూపంలో బలమైన పేస్ బెంచ్ భారత్కు ఉంది. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాడి రూపంలో మంచి స్పిన్నర్ ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే గత మ్యాచ్లో ఓపెనర్లు రాహుల్, అగర్వాల్ మినహా మిగతావారెవరూ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్లో మిగతావారు కూడా రాణిస్తారని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లోనైనా గాడిలో పడాలని అంతా కోరుకుంటున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తొలి మ్యాచ్ గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఒత్తిడిలో సౌతాఫ్రికా
తొలి టెస్టు మ్యాచ్లో ఓటమిపాలైన సౌతాఫ్రికా జట్టు.. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి టెస్ట్ మ్యచ్లో ఒకరిద్దరు బ్యాటర్లు మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ఈ మ్యాచ్లో బ్యాటర్లంతా రాణించాలని సౌతాఫ్రికా మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడంతో సౌతాఫ్రికా బ్యాటింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. అయితే బౌలింగ్లో మాత్రం సౌతాఫ్రికా బలంగా ఉంది. కగిసో రబాడ, ఎంగిడి రూపంలో మంచి పేసర్లు జట్టులో ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్లో సత్తా చాటిన బౌలింగ్ దళం ఈ మ్యాచ్లోనూ రాణించాలని భావిస్తోంది. బౌలర్లకు తోడు బ్యాటర్లు కూడా రాణిస్తే మ్యాచ్ గెలవొచ్చని సఫారీలు భావిస్తున్నారు. తద్వారా సిరీస్ను 1-1తో సమం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది.

జోహన్నెస్బర్గ్లో ఓటమిరుగని భారత్
జోహన్నెస్ బర్గ్లో టీమిండియా ఇప్పటివరకు ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ 3 దశాబ్దాల కాలంలో అక్కడ 5 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత్.. రెండిట్లో గెలిచి, మూడు మ్యాచ్లు డ్రాగా ముగించింది. దీంతో సౌతాఫ్రికాలో భారత్కు కలిసొచ్చిన మైదానంగా జోహన్నెస్ బర్గ్కు పేరుంది. దీంతో ఈ మ్యాచ్లో కోహ్లి సేన సత్తా చాటుతుందని అంతా నమ్ముతున్నారు. చివరగా 2018లో ఇక్కడ జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియా 63 పరుగుల తేడాతో గెలిచింది.

పిచ్, వాతావరణం
జోహన్నెస్బర్గ్లోని వాండర్స్ పిచ్ పేస్, బౌన్స్కు అనుకూలిస్తుంది. దీంతో ఇక్కడ పేసర్లు అధిపత్యం చెలాయించడం ఖాయం. అయితే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే 5 రోజుల్లో ఏకంగా 4 రోజులు వర్షం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జట్లు అంచనా
భారత్:
రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా:
డీన్ ఎల్గర్, కైల్ వెర్నీన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, టెంబా బావుమా, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, ఎంగిడి, జార్జ్ లిండే.


Click it and Unblock the Notifications












