వరల్డ్ కప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ తిరిగి టీమిండియా పగ్గాలను అందుకున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో భారత జట్టును నడిపించనున్నాడు. రోహిత్తో పాటు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా కూడా సౌతాఫ్రికా టెస్టు సిరీస్తోనే తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. అయితే సఫారీ గడ్డపై భారత్ ఇప్పటివరకు ఒక్కసారి టెస్టు సిరీస్ సాధించలేకపోయింది. 1992 నుంచి టీమిండియా ఎనిమిది సార్లు దక్షిణాఫ్రికా పర్యటను వెళ్లింది.
అయితే సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా ఈ సారి చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్ బ్యాటింగ్లో, బుమ్రా, సిరాజ్ బౌలింగ్లో ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే హిట్మ్యాన్ ధోనీ రికార్డుకు చేరువలో ఉన్నాడు. రోహిత్ జోరు చూస్తుంటే సెంచూరియన్ వేదికగా రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో ఆ రికార్డు బద్దలయ్యేలా ఉంది.

టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ప్లేయర్లుగా తొలి మూడు స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఉన్నారు. సెహ్వాగ్ 90 సిక్సర్లు (178 ఇన్నింగ్స్లు), ధోనీ 78 సిక్సర్లు (144 ఇన్నింగ్స్లు), రోహిత్ 77 సిక్సర్లు (88 ఇన్నింగ్స్లు)లతో టాప్-3లో ఉన్నారు. ధోనీ సరసన చేరడానికి హిట్మ్యాన్ మరో సిక్సర్ దూరంలోనే ఉన్నాడు. ఈ రికార్డును తొలి టెస్టులోనే సాధిస్తాడని రోహిత్ అభిమానులు ఆశిస్తున్నారు.
కాగా, డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్టౌన్లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.