భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్గా అవతరించింది. 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బార్బడోస్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి టైటిల్ సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబె (27; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు. కేశవ్ మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (39; 31 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు. హార్దిక్ పాండ్య (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు. అయితే భారత్కు ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా చరిత్రకెక్కిన రోహిత్ శర్మ విజయానంతరం ఆసక్తికరమైన పనులు చేశాడు.
పిచ్పై ఉన్న చిటికెడు మట్టిని రోహిత్ తిన్నాడు. ఈ చారిత్రక విజయం ఎప్పటికీ గుర్తిండిపోవాలని, తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ పోస్ట్ చేయగా, ఇది నెట్టింట వైరల్గా మారింది. అంతేగాక బార్బడోస్ మైదానంలో రోహిత్ త్రివర్ణ పతాకాన్ని పాతాడు. గతంలో బీసీసీఐ సెక్రటరీ జైషా బార్బడోస్లో భారత్ పతకాన్ని ఎగురవేస్తామని ఓ సందర్భంలో పేర్కొన్నాడు. దీంతో విజయానంతరం రోహిత్ మువ్వన్నెల జెండాను మైదానంలోనే ఎగురవేశాడు. అనంతరం వాగ్ధానాన్ని నెరవేరచినట్లుగా త్రివర్ణ పతాకంతో కలిసి కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ హార్టిక్, జై షా ఫొటోలకు ఫోజులిచ్చారు.