భారత్ మరో సిరీస్కు సిద్ధమైంది. టీ20 సిరీస్ను 1-1తో పంచుకున్న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ మొదటి వన్డే జరనుంది. వన్డే ప్రపంచకప్ అనంతరం ఇరు జట్లకు ఇదే తొలి వన్డే కావడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. బ్రస్ట్ కాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించనుంది.
మెగాటోర్నీలో ఇరు జట్లను నడిపించిన రోహిత్ శర్మ, బవుమా వన్డే సిరీస్కు కూడా దూరమయ్యారు. వారిద్దరి గైర్హాజరీలో కేఎల్ రాహుల్, మార్క్రమ్ జట్లను నడిపించనున్నారు. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్లు దూరమవ్వడంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కనున్నాయి. మరో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

అయితే రుతురాజ్ గైక్వాడ్ జ్వరంతో ఈ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది.ఓపెనర్లుగా సాయి సుదర్శన్, రజత్ పటిదర్కు జట్టు యాజమాన్యం అవకాశం ఇవ్వాలని భావిస్తుంది.ఆరో స్థానంలో సంజు శాంసన్కు బదులుగా రింకూ సింగ్ను బరిలోకి దించాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్ల్లో రింకూ రాణించిన సంగతి తెలిసిందే. దీంతో వన్డేల్లోనూ అతడి స్థానం ఖరారైంది. 3,4,5 స్థానాల్లో తిలక్ వర్మ,శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉండటంతో సంజు శాంసన్కు మరోసారి నిరాశ తప్పేలాలేదు.
ఇక ఆఖరి టీ20 జరిగిన జొహానెస్బర్గ్ వేదికగానే తొలి వన్డే జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. అవుట్ఫీల్డ్ వేగంగా ఉంటుంది.ఇక్కడ జరిగిన చివరి నాలుగు వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు మూడు సార్లు 300కు పైగా పరుగులు సాధించాయి. అయితే మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ అద్భుత డ్రైనేజీ సిస్టమ్ ఉండటంతో మ్యాచ్ సజావుగానే సాగే అవకాశాలు ఉన్నాయి.
భారత్ తుదిజట్టు అంచనా: సాయి సుదర్శన్, రజత్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ (కెప్టెన్ ), రింకూ సింగ్, అక్షర్ పటేల్,అర్షదీప్ సింగ్,అవేష్ ఖాన్,కుల్దీప్ యాదవ్,ముకేశ్ కుమార్