రాజ్కోట్: దక్షిణాఫ్రికా - భారత్ మధ్య ఆదివారం మధ్యాహ్నం జరగనున్న మూడో వన్డే మ్యాచ్లో తాము నిరసన తెలపడం ఖాయమని పటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ మరోసారి స్పష్టం చేశాడు. తనకు, తన మద్దతుదారులకు టిక్కెట్లు దొరికాయని చెప్పాడు.
ఇక నిరసన తెలపడమే ఆలస్యమని చెప్పాడు. తాము అందరం మ్యాచ్కు వస్తున్నామని, అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నాడు. హార్దిక్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.
హార్దిక్ పటేల్ హెచ్చరికల నేపథ్యంలో రాజ్కోట్ మైదానం పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిషేధించారు. ఆసాధారణ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు వేలాది మంది పటేల్ ఉద్యమకారులు టిక్కెట్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఆందోళన నిర్వహించేందుకు పటేల్ వర్గీయులు టిక్కెట్లు కొనుగోలు చేయడంతో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ను గుబులు వెంటాండుతోంది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ నిరాటంకంగా సాగుతుందని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చెబుతోంది.
పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రాజ్ కోట్లో వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ పైన నిషేధం విధించారు. రాత్రి పదిగంటల వరకు ఈ నిషేధం ఉంటుందన్నారు. మైదానంకు వచ్చే అన్ని మార్గాల్లో నిఘాను పెంచారు. ప్రత్యేకంగా రూపొందించిన మూడు డ్రోన్ కెమెరాలతో ప్రేక్షకుల కదలికలపై నిఘా ఉంచుతున్నారు.
స్టేడియంలో 90కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండువేల మంది సాధారణ పోలీసులతో భద్రతను పెంచారు. మూడు కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలను మోహరిస్తున్నారు. ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంది. మూడు బృందాల క్విక్ రెస్పాన్స్ సెల్ ుంది. ఐదుగురు సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తున్నారు.