టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా భారత్ నిలిచింది. 13 ఏళ్ల ప్రపంచకప్ కలను రోహిత్ సేన నెరవేర్చింది. ఆశలు లేని స్థితి నుంచి గొప్పగా పోరాడి ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. సమష్టిగా పోరాడుతూ ఓటమిని భయపెట్టి గెలుపు తీరాలకు ఘనంగా చేరింది. బార్బడోస్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే ఫైనల్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లకు గుడ్బై చెప్పారు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా కోచ్ పదవికి వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమర్థుడైన ద్రవిడ్..ఈ సారి మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. భారత క్రికెట్కు ఎన్నో సేవలు అందించిన ద్రవిడ్ ప్లేయర్గా ప్రపంచకప్ను అందుకోలేకపోయాడు. కానీ ఆ కలను కోచ్గా నెరవేర్చుకున్న వేళ ఉబికివస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
2021 నవంబర్లో టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకున్న ద్రవిడ్ గత టీ20, వన్డే ప్రపంచకప్ల్లో జట్టును గెలిపించలేకపోయినా.. ఆఖరి మిషన్లో మాత్రమే సక్సెస్ అయ్యాడు. మరోవైపు ద్రవిడ్ గుడ్బై చెప్పడంతో ఆటగాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ద్రవిడ్ను ఎత్తుకొని జైకొట్టారు. ఘనంగా ఫేర్వెల్ ఇచ్చారు.