
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం (జనవరి 5)న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత పేసర్లకు ఓ సలహా ఇచ్చాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో తొలి టెస్టు మ్యాచ్ జరిగే కేప్ టౌన్ పిచ్ను పేసర్లు గరుకుగా మార్చాలని సూచించాడు. వాస్తవానికి సఫారీ పిచ్లు స్పిన్కు పెద్దగా అనుకూలించవు. తడి ఎక్కువగా ఉండి.. పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి పేసర్లు పిచ్ను గరుకుగా మారిస్తే స్పిన్నర్లకు అనుకూలిస్తాయి.
2010-11 దక్షిణాఫ్రికాలో పర్యటనలో హర్భజన్ కోసం జహీర్ ఖాన్ ఇలాగే చేశాడని టెండూల్కర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. '2010లో జరిగిన సిరీస్లో కేప్టౌన్ టెస్ట్ సందర్భంగా రెండో ఇన్నింగ్స్లో హర్భజన్ సింగ్ ఏకంగా 7 వికెట్లు తీసుకున్నాడు. దీనికి కారణం జహీర్ఖాన్. ఎడమచేతి వాటం బౌలర్ అయిన జహీర్.. పిచ్ను గరుకుగా మార్చి భజ్జీకి సాయం చేశాడు' అని సచిన్ తెలిపాడు.
'మరోవైపు ఇషాంత్, శ్రీశాంత్ కూడా రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి పిచ్ను మరింత గరుకుగా మార్చారు. రైట్ హ్యాండర్లను ఇబ్బంది పెట్టడానికి హర్భజన్కు ఇది బాగా ఉపయోగపడింది' అని సచిన్ చెప్పాడు. ఇక, దక్షిణాఫ్రికా వాతావరణం అశ్విన్కు సవాలేనని సచిన్ టెండూల్కర్ తెలిపాడు.
'పిచ్లో తేమ కారణంగా స్పిన్నర్లు పెద్దగా రాణించరని, అందుకే పేసర్లు అశ్విన్కు ఈ విధంగా సాయం చేయాలి' అని సచిన్ సలహా ఇచ్చాడు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రోహిత్ శర్మను తీసుకోవాలా లేదా హార్దిక్ పాండ్యానా అన్నది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను' అని సచిన్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.