దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓడినా నయా ఫినిషర్ రింకూ సింగ్ ప్రశంసలు పొందాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రింకూ ఆఖరి వరకు నిలిచాడు. ఇక అతడి పవర్ హిట్టింగ్కు మీడియా బాక్స్ గ్లాస్ కూడా పగిలిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రింకూ సింగ్ను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి కొనియాడాడు.''రింకూ సింగ్ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. అంతకుముందు అతడికి ఎక్కువ ఓవర్ల పాటు ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు''

''రింకూ క్రికెట్లో ఉన్న అన్ని షాట్లు ఆడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్తో పాటు బ్యాక్ ఫుట్పై కూడా బౌండరీలు బాదుతున్నాడు. భారీ షాట్లు ఆడుతున్నాడు. అలాగే ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ అదరగొడుతున్నాడు. ఇక రింకూ కుదురుకుంటే అతడిని ఆపడం చాలా కష్టం. గత మ్యాచ్ లో చేసిన హాఫ్ సెంచరీ అతడికి మరింత బలాన్ని ఇస్తుంది'' అని గవాస్కర్ అన్నాడు. ఇటీవల రింకూను గవాస్కర్ నయా యువరాజ్ సింగ్గా కొనియాడిన విషయం తెలిసిందే.
కాగా, జొహానెస్బర్గ్ వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా నిర్ణయాత్మక ఆఖరి టీ20లో తలపడనున్నాయి. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో సఫారీ సేన విజయం సాధించింది. పొట్టి సిరీస్ను 1-1తో సౌతాఫ్రికాతో పంచుకోవాలంటే సూర్యకుమార్ సేన ఇవాళ తప్పక గెలవాల్సిందే.
అయితే టీమిండియా మేనేజ్మెంట్ సిరీస్ ను కాపాడుకోవడంతో పాటు టీమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. వచ్చే ఏడాది జూన్ వెస్టిండీస్-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీ ముందు భారత్ ఇవాళ మ్యాచ్ తో కలిపి మరో నాలుగు మ్యాచ్ లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ అంచనాకు రావాలని ప్రయత్నిస్తోంది.