
హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా బుధవారం ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్పై అభిమానులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత ధోని బ్యాట్ నుంచి జాలువారిన ఈ హాఫ్ సెంచరీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ధోని కేవలం 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ధోనికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 65 ఇన్నింగ్స్లు ఆడిన ధోని గత 12 ఇన్నింగ్స్లలో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం గమనార్హం.
అయితే, ధోని హాఫ్ సెంచరీతో రాణించినా... ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 16వ ఓవర్ నుంచి పాండే, ధోనిలు దూకుడుగా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు వచ్చాయి. తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన టీమిండియా చివరి 10 ఓవర్లలో 103 పరుగులు చేసింది. పాండే 33, ధోనీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
ఈ ఇద్దరు ఐదో వికెట్కు అజేయంగా 98 పరుగులు జోడించారు. ఈ సందర్భంగా ధోనిపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 'ధోని కత్తి తిప్పడం మర్చిపోలేదు, వైవిద్యమైన ఆటగాడి నుంచి మరో ప్రత్యేక ఇన్నింగ్స్ వచ్చింది' అని ట్వీట్ చేశాడు.
ఇక, మహమ్మద్ కైఫ్ 'వావ్ ధోని ఏం కొట్టావ్.. గొప్ప ఇన్నింగ్స్ ఆడావ్' అంటూ ట్వీట్ చేశాడు. చాలా కాలంగా ధోనీ ఇన్నింగ్స్ను చూడలేకపోయానని, కానీ మిడిలార్డర్లో మెరవడం సంతోషంగా ఉందని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.