
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ వరుసగా రెండు ఓటములు చవిచూసింది. దీంతో భారత జట్టు కూర్పు వస్తున్న వాదనలలో పలువురు విభిన్న రకాలుగా స్పందించారు. ఈ విషయంలో మరొక కొత్త గొంతు వినిపిస్తుంది. ఇప్పటివరకు రహానెను తీసుకోండి అంటూ అందరూ చెప్తూ వచ్చారు. కానీ, నన్ను తీసుకోండి అంటూ ఏ ఆటగాడు అడగలేదు. ఇప్పుడు మాత్రం నాకు అవకాశం దొరికితే నేనేంటో చూపిస్తా అంటున్నాడు. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్.
దక్షిణాఫ్రికా గడ్డపై తనకి అవకాశం దొరికితే తప్పకుండా సత్తా నిరూపించుకుంటానని భారత జట్టు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్ త్వరలోనే అక్కడికి చేరనున్నాడు. శ్రేయాస్ ప్రస్తుతం ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడుతున్నాడు. మంగళవారం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.
'దక్షిణాఫ్రికా గడ్డపై 100 శాతం రాణిస్తాననే నమ్మకంతో ఉన్నా. నా ప్రతిభపై నాకు ఎలాంటి సందేహాలు లేవు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనై బ్యాటింగ్కి వెళ్లగలను. గత ఏడాది జులైలో భారత్-ఎ జట్టు తరఫున దక్షిణాఫ్రికా గడ్డపై మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా నాకుంది. టెస్టు సిరీస్లో మ్యాచ్లు జరుగుతున్న తీరుని నిశితంగా పరిశీలిస్తున్నానున. దానికి అనుగుణంగానే ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. పేస్ పిచ్లపై బంతి తీరును గమనించాను. ఫ్రంట్ ఫుట్పై ఆడేకంటే బ్యాట్ ఫుట్పై ఆడితేనే మంచి ఫలితాలు సాధించొచ్చు' అని శ్రేయాస్ పేర్కొన్నాడు.
ఇంకా మాట్లాడుతూ..వన్డేల్లో తెలుపు బంతి బౌన్సర్లను ఎదుర్కోవడం కష్టమేం కాదని వ్యాఖ్యానించాడు. స్ట్రోక్స్ ఆడుతూ వెళితే బ్యాట్స్మెన్ ఆత్మవిశ్వాసం క్రమంగా రెట్టింపవుతుందని అభిప్రాయపడ్డాడు. రబాడ, మోర్నీ మోర్కెల్ లాంటి అత్యుత్తమ బౌలర్లని ఎదుర్కోవడం నాలాంటి బ్యాట్స్మెన్కి ఓ ఛాలెంజ్' అంటూ శ్రేయాస్ అభిప్రాయపడ్డాడు.
గత ఏడాది చివర్లో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సెలక్టర్లు అతని స్థానంలో శ్రేయాస్కి జట్టులో అవకాశం కల్పించారు. ఈ సిరీస్లో మూడు వన్డేలాడిన ఈ యువ బ్యాట్స్మెన్ 162 పరుగులతో మెరిశాడు. సఫారీలతో ఐదు వన్డేల సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.