
హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో ఉంది. మూడో రోజు లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 129/6 పరుగులతో నిలిచింది. క్రీజులో జార్జి లిండే(10), డేన్ పైడిట్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఇంకా 368 పరుగుల వెనుకంజలో ఉంది.
మూడో రోజు తొలి సెషన్ లో భారత బౌలర్ల హవా కొనసాగుతోంది. సోమవారం 9/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆడిన తొలి బంతికే దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఔటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చి బవుమా నిలకడగా ఆడుతూ స్కోరుని పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు జుబైర్ హమ్జా హాఫ్ సెంచరీ చేసి క్రీజులో పాతుకుపోయాడు. వీరిద్దరి జోడీ నిలకడగా ఆడుతూ సుమారు 22 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి వికెట్లు కోల్పోకుండా అడ్డుకున్నారు. ఇద్దరూ కలిసి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అలాంటి సమయంలో వీరిద్దరి జోడిని నదీమ్ తన స్పిన్తో విడదీశాడు. అంతకముందు 28వ ఓవర్లో జడేజా వేసిన నాలుగో బంతిని ఆడిని హంజా(62) బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్(6)ను జడేజా ఆరోవికెట్గా పెవిలియన్కు చేర్చాడు. 31.4వ ఓవర్లో జడేజా వేసిన బంతికి క్లాసెన్ బౌల్డ్ అయ్యాడు.
లంచ్ విరామానికి ముందు ఐదు ఓవర్ల వ్యవధిలో భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా కోల్పోయిన ఆరు వికెట్లలో భారత బౌలర్లలో ఉమేష్యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పేసర్ షమీ, అరంగేట్ర బౌలర్ నదీమ్ ఒక్కో వికెట్ తీశారు.