
హైదరాబాద్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ శర్మ, రహానే ఆదుకున్నారు. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ మూడో టెస్టులో సెంచరీకి చేరువయ్యాడు.
టీమిండియా కీలక వికెట్లు చేజార్చుకున్న సమయంలో రోహిత్ శర్మ నిలకడగా ఆడి స్కోరు బోర్డుని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 52 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది.
తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(10), చతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(12)లు త్వరగా పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఆచితూచి ఆడుతూ స్కోరున పరుగులు పెట్టిస్తున్నాడు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అనంతరం రహానే కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకు ఇది 21వ హాఫ్ సెంచరీ. 70 బంతుల్లో 8 ఫోర్లతో రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 44 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(92), రహానే(59) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకముందు జట్టు స్కోరు 16 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడా వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి అగర్వాల్(10) ఔటయ్యాడు. రబాడ వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్ థర్డ్ స్లిప్లో ఉన్న డీన్ ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చిన పుజారా కూడా నిరాశపరిచాడు.
రబాడ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో మొత్తం తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు.