టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి సెషన్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రబడా వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి అగర్వాల్(10) ఔటయ్యాడు. రబాడ వేసిన బంతిని నిర్లక్ష్యంగా ఆడిన మయాంక్ థర్డ్ స్లిప్లో ఉన్న డీన్ ఎల్గర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
పుజారా డకౌట్
ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చిన పుజారా కూడా నిరాశపరిచాడు. రబాడ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి తృటిలో ఎల్బీడబ్యూ అయ్యే అవకాశం తప్పించుకున్న పుజారా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ మూడో బంతికి ఎల్బీగానే ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్లో మొత్తం తొమ్మిది బంతులు ఆడిన పుజారా డకౌట్గా పెవిలియన్ చేరాడు.
ఎల్బీగా విరాట్ కోహ్లీ
అనంతరం నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 52 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అనంతరం రహానే కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో రహానే 21వ హాఫ్ సెంచరీ
టెస్టుల్లో రహానేకు ఇది 21వ హాఫ్ సెంచరీ. 70 బంతుల్లో 8 ఫోర్లతో రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సిక్స్తో సెంచరీ సాధించాడు. ఈ సిరీస్లో రోహిత్కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 6వది కావడం విశేషం.
|
ధోని రికార్డుని సమం చేసిన రోహిత్
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా... రోహిత్ శర్మ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఒక సిరీస్లో భారత్ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో గవాస్కర్ తర్వాత ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.
|
మూడు అంతకంటే ఎక్కువ సెంచరీలను
గవాస్కర్ తన కెరీర్లో ఒక సిరీస్లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. 1977-78లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో మూడు సెంచరీలు సాధించిన గవాస్కర్.. ఆ తర్వాత 1978-79 సీజన్లో విండిస్తో జరిగిన సిరీస్లో నాలుగు సెంచరీలు సాధించాడు. అంతకుముందు 1970-71 సీజన్లో కూడా విండిస్పై ఒక్క సిరీస్లో గవాస్కర్ నాలుగు సెంచరీలు సాధించాడు.
|
సెంచరీకి చేరువైన రహానే
ఆ తర్వాత రహానే కూడా సెంచరీకి చేరువయ్యాడు. ఈ సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. ఇక మ్యాచ్ తిరిగి కొనసాగించేందుకు వాతావరణం అనుకూలించే అవకాశం లేకపోవడంతో ఈరోజు ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలిరోజు కేవలం 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.