
హైదరాబాద్: పూణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం బవుమా(2), డికాక్(1) పరుగుతో క్రీజులో ఉన్నారు. మరోవైపు ఈ టెస్టులో టీమిండియా విజయానికి ఇంకా ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.
రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో సాహా రెండు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో బంతి డిబ్రుయన్ బ్యాట్ తగిలి దూరంగా వెళుతుండగా, సాహా అమాంతం డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు.
ఆ తర్వాత 24వ ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్(5)ను పెవిలియన్కు పంపాడు. అశ్విన్ వేసిన 24 ఓవర్ మూడో బంతి డుప్లెసిస్ బ్యాట్కు తగిలింది. ఆ సమయంలో వికెట్లకు దగ్గరగా ఉన్న సాహా చేతుల్లోంచి బంతి చేజారిపోయిందని అనిపించింది. అయితే, తక్కువ ఎత్తులో వచ్చిన బంతి తన చేతుల్లోంచి రెండు సార్లు జారిపోయినా మూడోసారి మాత్రం సాహా ఒడిసి పట్టుకున్నాడు.
ఈ క్యాచ్ మ్యాచ్కే హైలైట్ అని చెప్పవచ్చు. ఈ క్యాచ్తో సాహా అత్యుత్తమ వికెట్ కీపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అంతకముందు మ్యాచ్ మొదలైన రెండో బంతికే ఇషాంత్ శర్మ తొలి వికెట్ వికెట్ పడగొట్టాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన మార్కరమ్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి మార్కరమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 275 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 601/5 వద్ద డిక్లేర్డ్ చేయడంతో భారత్కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్లో పడింది.
దక్షిణాఫ్రికా కోల్పోయిన నాలుగు వికెట్లలో అశ్విన్ రెండు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లు తలో వికెట్ తీశారు. తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించేలా కనిపిస్తోంది.