పుష్కరకాల వన్డే కప్ కలను నెరవేర్చడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడి కప్ను చేజార్చుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ను సాధించి చరిత్ర సృష్టించడానికి సఫారీ గడ్డపై రోహిత్ పట్టుదలతో అడుగుపెట్టాడు. కానీ మరోసారి నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. దీంతో కేవలం సిరీస్ సమం చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంది.
అయితే దక్షిణాఫ్రికాలో సిరీస్ను సమం చేయడం కూడా అంత సులువు కాదు. గత ఎనిమిది పర్యటనల్లో ఒక్కసారే టీమిండియా సిరీస్ను సమం చేసింది. ఆ ఘనతను 2011లో ఎంఎస్ ధోనీ మాత్రమే సాధించాడు. ఇప్పుడు ధోనీ సరసన నిలబడటానికి రోహిత్కు మంచి అవకాశం ఉంది. రేపు ప్రారంభం కానున్న టెస్టులో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. అయితే అంతకంటే ముందు రోహిత్ కెప్టెన్గా కంటే బ్యాటర్గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ రికార్డు పేలవంగా ఉంది. పది ఇన్నింగ్స్ల్లో అతడు సాధించిన పరుగులు 128 మాత్రమే. అందులో అత్యధిక స్కోరు 47గా ఉంది. ఆ అత్యధిక స్కోరును పరిగణించకపోతే సఫారీ గడ్డపై రోహిత్ సగటు కేవలం 9 మాత్రమే. రోహిత్ సామర్థ్యంతో సౌతాఫ్రికాలో అతడి గణాంకాలు పోలిస్తే తీసికట్టుగా ఉన్నాయి. అయితే రోహిత్ శర్మకు న్యూ ఇయర్ సెంటిమెంట్ ఉంది. 2021, 2023 సంవత్సరాల్లో భారత్ తరపున రోహిత్ శర్మనే తొలి సెంచరీ చేశాడు. అదే రీతిలో ఈ ఏడాది కూడా హిట్ మ్యాన్ తన రికార్డును రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు కేప్ టౌన్లో టీమిండియా విజయం సాధించాలంటే బ్యాటింగ్తో పాటు కెప్టెన్గానూ దూకుడు పెంచాల్సి ఉంది. తొలి టెస్టులో సెషన్ ప్రారంభంలో ప్రధాన పేసర్లు కాకుండా ప్రసిధ్, శార్దూల్తో బౌలింగ్ చేయించిన రోహిత్ వ్యూహంపై విమర్శలు వచ్చాయి. అంతేగాక బౌలర్లను ఉత్తేజపరిచేలా ఫీల్డర్లు నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. ఈ నేపథ్యంలో అందరిలో జోష్ నింపుతూ జట్టును నడిపించాల్సిన బాధ్యత రోహిత్కు ఉంది. కాగా, కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.