
హైదరాబాద్: సఫారీ గడ్డపై తన తొలి వన్డేలో సక్సెస్ సాధించడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనియేనని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. డర్బన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి మూడు తీసి 34 పరుగులిచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తీసిన మూడు వికెట్లు జేపీ డుమిని, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్లు కీలక వికెట్లు కావడం విశేషం. మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ 'తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై ఆడేందుకు వచ్చిన నేను చాలా ఆందోళనకు గురయ్యా. ఇక్కడ బౌలింగ్ ఎలా చేయాలన్న దానిపై నాకు ఏమాత్రం అవాగాహన లేదు' అని అన్నాడు.
'అలాంటి సమయంలో నేను ధోనీని ఆశ్రయించాను. అలాగే ఎలా బౌలింగ్ చెయ్యాలో చెప్పమని అడిగా. 'నువ్వు ఎలా బౌలింగ్ చేస్తావో అలాగే చెయ్యి' అని ధోని చెప్పాడు. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మ్యాచ్లో వికెట్ల వెనుక నుంచి ధోనీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నాడు. అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి' అని కుల్దీప్ తెలిపాడు.
'ప్రస్తుతం జట్టులో ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు. వారిద్దరే కోహ్లీ, ధోనీ. ఒకరు ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నారు. మరొకరు ఇప్పటికే జట్టును విజయవంతంగా నడిపించారు. ధోని బాయ్ ఇప్పటికే ఎంతో క్రికెట్ ఆడాడు కాబట్టి, బ్యాట్స్మన్ మైండ్ను ఈజీగా చదివేయగలడు' అని కుల్దీప్ అన్నాడు.
'మేము యువకులం కాబట్టి మాకు అనుభవం తక్కువ. దీంతో ధోని ఎప్పటికప్పుడు మాకు పరిస్థితిని వివరించి సలహాలు ఇస్తూ ఉంటాడు. దీంతో మాకు బౌలింగ్ వేయడం సులువు అవుతోంది. ఇక కోహ్లీ విషయానికి వస్తే, 10 పరుగులను ఆదా చేయడం కంటే కూడా ఒక వికెట్ తీయడం ఎంతో ముఖ్యమని చెబుతాడు. కెప్టెన్ ఏదైనా నీకు చెబుతున్నాడంటే మనల్ని మనం విశ్వసించాలి' అని తెలిపాడు.
ఆరు వన్డేల సిరిస్లో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధించడంతో సిరిస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా రెండో వన్డే జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.