
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జనవరి 5న కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్తో తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న జస్ప్రీత్ బుమ్రా తన సఫారీ పర్యటన అనుభవాలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఇందులో దక్షిణాఫ్రికా పిచ్లపై వేగంగా అవగాహన తెచ్చుకునేందుకు భారత క్రికెటర్లు వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు.
తొలి టెస్టులోనే శుభారంభం చేసి ఈ సిరిస్ను విజయంతో ప్రారంభాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. ఇందులో భాగంగా నెట్స్లో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ప్రాక్టీస్లోనూ తన ప్రత్యేకత కనబరుస్తున్నారని.. సీనియర్ బౌలర్ల నుంచి చాలా విషయాలను నేర్చుకుంటున్నట్లు బుమ్రా వివరించాడు.
'కేప్ టౌన్కు వచ్చిన తర్వాత ఇది టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్. భారత బౌలర్లు మధ్య వికెట్ని లక్ష్యంగా చేసుకుని బంతులు విసురుతుండగా.. బ్యాట్స్మెన్లు మ్యాచ్ తరహా బ్యాటింగ్ ఆర్డర్లోనే వచ్చి వాటిని ఎదుర్కొంటున్నారు. ఇలా చేస్తుండటంతో పిచ్, వాతావరణంపై వేగంగా అవగాహన వచ్చే అవకాశముంది. జట్టు మొత్తం నెట్స్లో చాలా కష్టపడుతోంది' అని బుమ్రా అన్నాడు.
'నా వరకు, టెస్టు జట్టుతో ఇదే తొలి పర్యటన. వన్డే జట్టుతో కలిసి చాలా రోజుల నుంచి ప్రయాణిస్తున్నాను. టెస్టు జట్టులో ఉండే వాతావరణం నాకు బాగా నచ్చింది. సీనియర్ బౌలర్లతో పాటు కోచ్ల నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నాను' అని బుమ్రా వివరించాడు.
ఇరు జట్ల మధ్య తొలి టెస్టు కేప్ టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా జనవరి 5న జరగనుంది. ఈ టెస్టుతో బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి ఆరంగేట్రం చేయనున్నాడు.