టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెరీర్ ఆరంభంలోనే రికార్డులు బద్దలు కొడుతూ భవిష్యత్ స్టార్గా భరోసా ఇచ్చాడు. అయితే గత కొంతకాలంగా గిల్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వన్డేలు మినహా టెస్టులు, టీ20ల్లో పూర్తిగా తేలిపోతున్నాడు. తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో అతడు 30 స్కోరును కూడా దాటలేకపోయాడు.
అంతేగాక గిల్ ఫ్లాట్ వికెట్పైనే పరుగులు సాధిస్తున్నాడని, కఠిన పిచ్లపై విఫలమవుతున్నాడని ప్రధాన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 2 పరుగులకే ఔటయ్యాడు. దీంతో నెట్టింట్లో అతడిపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అహ్మదాబాద్ పిచ్పై మ్యాచ్ను నిర్వహించండి, తిరిగి ఫామ్లోకి వస్తాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే టీమిండియాలో తన స్థానం కాపాడుకోవాలంటే గిల్ పరుగులు తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. యశస్వీ జైశ్వాల్ రాకతో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. గిల్ టెస్టు కెరీర్ను ఓపెనర్గా ఆరంభించాడు. అయితే పుజారాకు సెలక్టర్లు మొండిచేయి చూపించడంతో గిల్ వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్నాడు.
''గిల్ ఆటలో క్లాస్ ఉంటుంది. అందులో సందేహం లేదు. తన మొదటి టెస్టులో బలమైన బౌలింగ్పై 90 పరుగులు సాధించాడంటే అతడికి తప్పక క్లాస్ ఉంటుంది. కానీ ఇప్పుడు చర్చంతా అతడి పరుగులు గురించి. అతడి సగటు 30 కంటే తగ్గుతూ వస్తుంది. ఇక టీమిండియాలో అతడి స్థానం కోసం తీవ్రపోటీ ఉంది. అతడు పరుగులు తప్పక చేయాల్సి ఉంది. వన్డేల్లో గిల్ రాణిస్తున్నాడు. కానీ టీ20ల్లో అయితే అతడికి విపరీతమైన పోటీ ఉంటుంది. టెస్టుల్లో టీమిండియా అతడికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నా'' అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70*) టాప్ స్కోరర్. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ అయిదు వికెట్లతో సత్తాచాటాడు.