

హైదరాబాద్: జోహెన్స్బర్గ్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గాయమైంది. దీంతో బుధవారం (ఫిబ్రవరి 21) జరిగే రెండో టీ20కి ఆతడు ఆడటంపై అనుమానం నెలకొంది. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, దీంతో తర్వాతి మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది.
ఆదివారం ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సింగిల్ కోసం ప్రయత్నించిన క్రమంలో ప్రమాదవశాత్తూ గాయపడ్డాడు.
ఈ సమయంలో కాలి నొప్పితో కాసేపు బాధపడిన కోహ్లీ ఆ తర్వాత షంసీ బౌలింగ్లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 13వ ఓవర్లో కోహ్లీ కాలి నొప్పితో బాధపడ్డాడు. నొప్పి బాగా పెరగడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. దీనిపై మ్యాచ్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'అదృష్టవశాత్తూ చేతికి ఎలాంటి గాయం అవ్వలేదు. కాలి గాయం కాస్త ఇబ్బంది పెడుతోంది. రెండో టీ20కి మాత్రం అందుబాటులో ఉంటా' అని అన్నాడు.
దీంతో కోహ్లీ తర్వాతి మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేది అనుమానంగా మారింది. చేతి గాయం తీవ్రమైనది కాకపోయినా, కాలి గాయం మాత్రం కాస్త తీవ్రమైనదేనని తెలుస్తోంది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 సెంచూరియన్ వేదికగా జరగనుంది.
కోహ్లీ అందుబాటులో లేకేపోతే రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/24) అద్భుత బౌలింగ్తో రాణించడంతో లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 175 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన తొలి పేస్ బౌలర్గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్ భువనేశ్వర్. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టీ20లో చాహల్ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.