గబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సఫారీ బౌలర్ల ధాటికి 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా రెండో వన్డేలో పేలవ ప్రదర్శన చేసింది. మూడు వన్డేల సిరీస్లో నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్ (4) మరోసారి నిరాశపరిచాడు. వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో), యువ ఓపెనర్ సాయి సుదర్శన్తో కలిసి (62; 83 బంతుల్లో)ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్కు 68 పరుగులు జోడించారు.సాయి సుదర్శన్ వరుసగా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే విలియమ్స్ బౌలింగ్లో క్లాసెన్ చేతికి చిక్కాడు.

తర్వాత బ్యాటింగ్కు వచ్చిన సంజు శాంసన్ (12) విఫలమయ్యాడు. అనంతరం టీమిండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. అర్షదీప్ సింగ్ (18), రింకూ సింగ్ (17), అవేశ్ ఖాన్ (9) అక్షర్ పటేల్ (7) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నాండ్రే బర్గర్ మూడు వికెట్లు, హెండ్రిక్స్, మహరాజ్ చెరో రెండు వికెట్లు, విలియమ్స్, మార్క్రమ్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు డి జోర్జి (119; 122 బంతుల్లో), హెండ్రిక్స్ (52; 81 బంతుల్లో) అదరగొట్టారు. తొలి వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ప్లేలో ముకేశ్ కుమార్, అర్షదీప్ బౌలింగ్లో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో జోర్జి సెంచరీ సాధించాడు. తన కెరీర్లో ఇదే తొలి శతకం. మరో ఓపెనర్ హెండ్రిక్స్ ఔటైనా డసెన్ (36)తో కలిసి జోర్జి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. సిక్సర్తో తమ జట్టును గెలిపించాడు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్, రింకూ సింగ్ చెరో వికెట్ తీశారు. జోర్జికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.