
హైదరాబాద్: శ్రీలంకతో గతేడాది చివర్లో టెస్టు సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం తనకు మంచి చేసిందని యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. కేప్టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలమైన వేళ హార్దిక్ పాండ్యా (93) కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
'నేను అబద్దం చెప్పడం లేదు.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. శ్రీలంకతో టెస్టు సిరీస్ విశ్రాంతి సమయంలో ఫిటెనెస్, బ్యాటింగ్ మెరుగుపర్చుకున్నా. గత కొద్దిరోజులుగా ఈ దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించే అంతా చర్చించారు. దీంతో సిరీస్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జీవితంలో సవాళ్లంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే.. అవి మనల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని నమ్ముతా' అని పాండ్యా అన్నాడు.
గతేడాది న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో పాండ్యా చేతికి గాయమైంది. దీంతో ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ నుంచి సెలక్టర్లు పాండ్యాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం 28/3ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రహానే స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ (11) పరుగుల వద్ద రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఎండ్లో పాతుకుపోయిన చతేశ్వర్ పుజారా (26) పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. లంచ్ విరామం వరకూ అశ్విన్ (12)తో కలిసి భారత ఇన్నింగ్స్ని నడిపించిన పుజారా.. అనంతరం తొలి బంతికే ఔటయ్యాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అశ్విన్(12), సాహా (0) కూడా పెవిలియన్కు చేరడంతో భారత్ 92/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (93)తో పరుగుల వరద పారించాడు. పరుగు ఖాతా తెరవడానికి 34 బంతులు ఆడిన భువనేశ్వర్ కుమార్ (25) ఆ తర్వాత చక్కటి డిఫెన్స్తో ఆకట్టుకున్నాడు.
వీరిద్దరూ ఎనిమిదవ వికెట్కి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. జట్టు స్కోరు 191 వద్ద భువీ ఔటవగా.. సెంచరీకి చేరువైన హార్దిక్ పాండ్యా అప్పర్ కట్ కొట్టే ప్రయత్నంలో జట్టు స్కోరు 199 వద్ద పెవిలియన్కు చేరాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.