
హైదరాబాద్: ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు 3-1 విజయంతో దూసుకుపోతోంది. మూడు వన్డేల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు నాలుగో వన్డేను చేజార్చుకుంది. ఐదో వన్డే గెలవడంతో సిరీస్ కైవసం అవుతుందనే పట్టుదలతో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా మ్యాచ్కు సిద్ధమైంది.
ఇదే వేదికగా 1992 నుంచి జరిగిన మ్యాచ్లలో భారత జట్టు ఒకసారి కూడా గెలిచిన దాఖలాల్లేవ్. ఈ చరిత్రను తిరగరేసేందుకు, ఈ వన్డే గెలిచి సిరీస్ ను చేజిక్కుంచుకునేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం ప్రాక్టీస్ నిమిత్ం టీమిండియా రెండ్రోజుల ముందే అక్కడికి చేరుకుంది.
అక్కడికి చేరుకున్న టీమిండియాకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం లభించింది. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలతో పాటు ఇతర ఆటగాళ్లు తాము బస చేసే హోటల్కు చేరుకోగా ప్రవేశ ద్వారానికి ముందు సంప్రదాయక దుస్తులు ధరించిన కళాకారులు డ్రమ్స్తో స్వాగతం పలికారు.
ఈ సంగీతానికి ఆటగాళ్లు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. పాండ్యా అయితే చిందులు వేస్తూ కనిపించాడు. హోటల్ లోపలికి వెళ్తూ ఆటగాళ్లు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారిని ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆటగాళ్లు సందడిగా గడిపారు.
ఐదో వన్డే ఫిబ్రవరి 13 మంగళవారం జరగనుంది. శనివారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.