దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టీ20, వన్డే మ్యాచ్లను ఘనంగా ముగించింది. పొట్టి ఫార్మాట్ సిరీస్ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఈ సారి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
దానికి తగ్గట్టుగానే వరల్డ్ కప్ అనంతరం స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. మరోవైపు మన ప్రణాళికను చూసి దక్షిణాఫ్రికా కూడా వాళ్ల కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. అయితే టెస్టు సిరీస్ కోసం ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్నాడని వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతడు భారత్కు బయల్దేరాడని కథనాలు వచ్చాయి.

అయితే విరాట్ కోహ్లి ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దక్షిణాఫ్రికాను విడిచి వెళ్లాడని, కానీ భారత్కు కాకుండా లండన్కు వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లండన్లో తన పనిని పూర్తిచేసుకున్న కోహ్లి తిరిగి దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడని చెప్పాయి. ''డిసెంబర్ 15న కోహ్లి ఇండియా నుండి దక్షిణాఫ్రికాకు బయలుదేరాడు. డిసెంబర్ 19న లండన్కు వెళ్లాడు. దాని కంటే ముందు 3-4 ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం తిరిగి టీమిండియాతో చేరాడు. బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు" అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
కాగా, డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.కేప్టౌన్లో చివరి టెస్టు జనవరి 03న మొదలవుతుంది. అయితే గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో రుతురాజ్ వేలికి గాయమైన విషయం తెలిసిందే.