పరిస్థితులను అంచనా వేయడంలో
ఇప్పటివరకు భారత్ తరుపున 11 టెస్టులు, 12 వన్డేలు, 19 టీ20లకు ప్రాతినిథ్యం వహించిన ఈ యువ వికెట్ కీపర్ మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడంలో ఇంకా అనుభవం తెచ్చుకోవాలని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు శైలిని మార్చుకోవాల్సిన పంత్ మూడో టీ20లో మరోసారి అదే అలక్ష్యం ప్రదర్శించాడు.
స్వల్ప వ్యవధిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఔట్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో స్వల్ప వ్యవధిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఔటై భారత్ కష్టాల్లో పడ్డప్పడు ఒక రెండు ఓవర్లు మాత్రమే నిలకడగా ఆడిన పంత్... ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఓ చెత్త షాట్కు వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
మూడో టీ-20లో దక్షిణాఫ్రికా విజయం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ-20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. కృనాల్ బౌలింగ్లో బవుమా సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది.
భారత్లో సఫారీ రికార్డు పదిలం
ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ టీమిండియా, మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచాయి. దీంతో భారత గడ్డపై సఫారీలు తమ రికార్డుని పదిలం చేసుకున్నారు. భారత్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 సిరిస్ కూడా నెగ్గక పోవడం విశేషం.