
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో మరో టెస్టు మిగిలుండగానే కోహ్లీసేన 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సఫారీ గడ్డపై కోహ్లీసేన చెత్త ప్రదర్శనపై అభిమానులు మండిపడుతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సమావేశంలో సహనం కోల్పోవడం, విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేయడం అభిమానులకు నచ్చినట్టు లేదు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు కోహ్లీకి చురకలు అంటించారు. 'దూకుడు కాస్త తగ్గించుకోవాలని, నీ దూకుడు మైదానంలో చూపించు, మైదానం వెలుపల కాదు' అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 'క్రికెట్ నీ కంటే ఎంతో గొప్ప ప్లేయర్స్ను చూసింది.. నీ పొగరు తగ్గించుకుంటే మంచిది' అంటూ సలహాలు ఇస్తున్నారు.
'మీడియా సమావేశంలో కోహ్లీ తన సహనాన్ని కోల్పోయాడు. ఇప్పుడిప్పుడే కోహ్లీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓటమిని స్వీకరించడం కోహ్లీ అలవాటు చేసుకోవాలి, ఏదైనా తప్పు చేస్తే ముందు దాన్ని ధైర్యంగా ఒప్పుకోవాలి. కోహ్లీ ఇచ్చిన సమాధానం అతని తెలివితక్కువ తనాన్ని అర్ధం పడుతోంది. చివరి టెస్టులో రహానే, భువీని ఆడించు, నీ నుంచి ఇలాంటి సమాధానమే వస్తుందని నేను ముందుగానే ఊహించాను. ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు, అభిమానులారా ధోనీకి కోహ్లీకి మధ్య తేడా ఏమిటో అర్థమైందా? అని నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.
ఈ పొగరేదో ఫీల్డ్లో చూపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఒక నెటిజన్ అనగా.... నువ్విలాగే ఉంటే నీ కెరీర్ పతనం ఖాయమని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
అసలేం జరిగిందంటే?
సెంచూరియన్ టెస్టులో బుధవారం రెండో టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కోహ్లి సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓ రిపోర్టర్ 'దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచుల్లో బెస్ట్-11తో బరిలోకి దిగారా' అని ప్రశ్నించగా కోహ్లీ నిగ్రహం కోల్పోయాడు.
'ఒకవేళ మేం గెలిచి ఉంటే బెస్ట్ 11 అన్న ప్రస్తావన వచ్చేదా? ఫలితం ప్రకారం తుది జట్టును నిర్ణయించలేం. ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్ చేయండి. మేం ఆడతాం. నా టీమ్మేట్స్ను మభ్య పెట్టడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. అయినా నేను ఇక్కడికి సమాధానాలు చెప్పటానికి మాత్రమే వచ్చాను. మీతో గొడవ పడటానికి కాదు' అంటూ కోహ్లీ అన్నాడు.