దక్షిణాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే మ్యాచ్లను ఘనంగా ముగించిన భారత్ టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1992 నుంచి ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్టు సిరీస్లాడింది. ఏడింట్లో పరాజయం పాలైన టీమిండియా ఓ సిరీస్ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ సారి సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
అయితే తొలి టెస్టు తుది జట్టులో యశస్వి జైశ్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. కానీ అతడి నుంచి సెంచరీ, డబుల్ సెంచరీలు ఆశించొద్దని అన్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్ రికార్డు సృష్టించాడు. ఆసియా వెలుపల అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు.

''వెస్టిండీస్లో ఉపఖండ పిచ్ వికెట్లు పోలి ఉంటాయి. కానీ దక్షిణాఫ్రికాలో అలా ఉండదు. పేస్కు అనుకూలిస్తూ సవాలుగా ఉంటుంది. జేన్సన్, రబాడ, ఎంగిడి, బర్గర్ వంటి బౌలర్ల నుంచి బౌన్సర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైశ్వాల్ ఫ్రంట్, బ్యాక్ ఫుట్ మీద సమర్థంగా బ్యాటింగ్ చేయగలడు. కానీ సఫారీ గడ్డపై సవాలుగా ఉంటుంది. అతడు ఈ సిరీస్లో మంచి అనుభవాన్ని పొందుతాడు. కానీ ఆ యువ ప్లేయర్ నుంచి సెంచరీ, డబుల్ సెంచరీలు ఆశించొద్దు''
''యశస్వీ జైశ్వాల్ సెంచరీ కూడా చేయొచ్చు. అలా కాకుండా అతడు 25-30 పరుగులే చేసినా గొప్ప ప్లేయర్గా భారత్కు తిరిగొస్తాడు. 10-15 ఏళ్ల క్రితం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనకు ఓ యువ ఆటగాడు వెళ్తే అతడి గురించి పెద్దగా చర్చించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అతడి ఆట గురించి విశ్లేషిస్తూ విమర్శిస్తారు'' అని గంభీర్ అన్నాడు.
కాగా, డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్టౌన్లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.