ముంబై: ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయని తెలుసు. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నా అని టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. భారత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టులో యువకులకు పెద్దపీట వేస్తున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో. పేస్, స్పిన్ విభాగంలో ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మొహమ్మద్ సిరాజ్, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లాంటి కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు.
టిమ్పైన్ సమయం ముగిసింది.. కెప్టెన్గా స్మిత్ బాధ్యతలు చేపట్టాలి: పాంటింగ్
కొత్తవారు జట్టులోకి రావడంతో ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ల్లో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు. పొట్టి ఫార్మాట్తో పాటు సుదీర్ఘ ఫార్మాట్లోనూ జట్టులో చోటు కోసం కుల్దీప్ ఎదురుచూస్తున్నాడు. మరోవైపు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కూడా చోటు కోల్పోయాడు. ఇద్దరూ ప్రస్తుతం జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నారు. కుల్దీప్, చాహల్ అసలైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై తాజాగా కుల్దీప్ స్పందించాడు.
కుల్దీప్ మాట్లాడుతూ... 'నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు భారతదేశం తరఫున ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. భారత్ తరఫున అరంగ్రేటం చేసి దాదాపుగా మూడేళ్లు అవుతోంది. ఈ సమయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు భవిష్యత్తులో కూడా ఎదురవుతాయి. హార్డ్ వర్క్, క్రమశిక్షణ లేకపొతే ఏది సాధ్యపడదు. ఈ బాటలో నేను పయనిస్తున్నాను. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీ20ల గురించి ఆలోచిస్తా' అని అన్నాడు.
కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులు, 53 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 21, వన్డేల్లో 96, టీ20ల్లో 35 వికెట్లు పడగొట్టాడు. 24 ఏళ్ల కుల్దీప్ మార్చి 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే మూడు ఫార్మాట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారతీయ బౌలర్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో బాగా రాణించడంతో అతడికి అవకాశం రాలేదు.