
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీసేన చెత్త ప్రదర్శనపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) బీసీసీఐని ఆదేశించింది. దీంతో బీసీసీఐ సఫారీ పర్యటనలో కోహ్లీసేన ప్రదర్శనపై జట్టు మేనేజ్మెంట్కు లేఖ రాసింది. మంగళవారం ముంబైలో వినోద్ రాయ్ నేతృత్వంలో సీఓఏ సమావేశమైంది.
స్వదేశంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా సఫారీ గడ్డపై చెత్త ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కోహ్లీసేన చెత్త ప్రదర్శనపైనే ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మాజీ క్రికెటర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా దక్షిణాఫ్రికా సిరీస్ ఆడటంపై, సఫారీ పర్యటనకు ముందు శ్రీలంకతో సిరీస్లు నిర్వహించడం వల్ల లాభం చేకూరలేదని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీసీసీఐ అధికారులు, వినోద్ రాయ్ నేతృత్వంలోని సీఓఏ సభ్యులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ వేళల్లో తీసుకున్న మార్పులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఐపీఎల్ 11వ సీజన్ను ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 4 గంటలకు జరిగే మ్యాచ్ని సాయంత్రం 5.30 గంటలకు, రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్ని 7 గంటలకు మార్చిన సంగతి తెలిసిందే.
'ఈ సమావేశంలో టీమిండియా ఓటముల గురించే ప్రధానంగా చర్చించాం. ఓటమికి గల కారణాల గురించి ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. టీమ్ మేనేజర్ నుంచి పూర్తి రిపోర్ట్ వచ్చిన అనంతరం దీనిపై మాట్లాడుతాం. ఇప్పుడు ఏమీ చేయలేం. ప్రస్తుతం ఆటగాళ్లతో పాటు అధికారులంతా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు' అని సమావేశానికి హాజరైన ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం దక్షిణాఫ్రికా పర్యటనకు పది రోజులు ముందు వచ్చినట్లైతే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్టౌన్లో జరిగిన టెస్టులో 72, సెంచూరియన్లో జరిగిన టెస్టులో 135 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ సిరిస్లో చివరిదైన మూడో టెస్టు బుధవారం (జనవరి 24)న జోహెన్స్ బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది.