IND vs SA T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లో జరిగిన సూపర్-8 మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరాజయం వల్ల జట్టు నెట్ రన్ రేట్ గణనీయంగా పడిపోవడమే కాకుండా సెమీఫైనల్ అవకాశాలు కూడా సంక్లిష్టంగా మారాయి. అయితే ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతమైన సెంటిమెంట్ను గుర్తుచేస్తోంది. ఈ పరాజయం వెనుక 2011 ప్రపంచకప్ విజయాన్ని పోలిన అరుదైన పోలికలు ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
భారత క్రికెట్ చరిత్రలో 2011 వన్డే ప్రపంచకప్ విజయం ఓ చిరస్మరణీయ ఘట్టం. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్గా నిలవడానికి ముందు ఎదుర్కొన్న పరిస్థితులు, ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్లో ఎదురవుతున్న పరిస్థితులు దాదాపు ఒకేలా ఉండటం విశేషం. 2011 ప్రపంచ కప్లో గ్రూప్ దశలో అజేయంగా దూసుకుపోతున్న భారత్.. కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓటమి పాలైంది. ఆ ఓటమి కూడా దక్షిణాఫ్రికా చేతిలోనే(3 వికెట్ల తేడాతో) ఎదురైంది. ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్లో కూడా టీమిండియా తన మొదటి ఓటమిని దక్షిణాఫ్రికా జట్టు చేతిలోనే చవిచూడటం అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

మరో ప్రధానమైన పోలిక ఏమిటంటే..
ఆనాడు 2011లో భారత్ ఆతిథ్య దేశంగా ఉంది. ఇప్పుడు 2026లో కూడా టీ20 ప్రపంచకప్ భారత్ వేదికగానే జరుగుతోంది. సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం అనేది అరిష్టంగా కాకుండా, కప్పు గెలవడానికి ఓ సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో ఆ ఓటమి తర్వాత భారత్ మరింత కసిగా ఆడి వరుస విజయాలతో ఫైనల్ చేరి, చివరకు శ్రీలంకను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్తిస్తే భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలవడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు ప్రోటీస్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయారు. 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడంతో 76 పరుగుల దారుణ పరాభవం తప్పలేదు. అయితే ఈ భారీ ఓటమి నేర్పిన పాఠాలతో భారత్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
సెంటిమెంట్లు మానసిక ధైర్యాన్ని ఇచ్చినప్పటికీ.. భారత్ ముందున్న అసలు సవాలు సెమీఫైనల్ చేరడం. సూపర్-8 రేసులో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్తో జరిగే తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్ తప్పనిసరిగా గెలవాలి. కేవలం గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో విజయం సాధించడం అనివార్యం. 2011 నాటి మ్యాజిక్ మళ్లీ పునరావృతమై సూర్యకుమార్ సేన ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడుతుందో లేదో వేచి చూడాలి!