కేప్ టౌన్లో జరుగుతున్న భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రోజు ఆటలో ఇరు జట్లు చెరోసారి ఆలౌట్ కావడమే కాకుండా, సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 62 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తుండటంతో ఇరు జట్లు పేసర్లు పోటాపోటీగా వికెట్ల దాహం తీర్చుకున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి 23.2 ఓవర్లలోనే ఆలౌటైంది. సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించగా, బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టాప్ స్కోరర్గా వెరీన్ (15) నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. 153/4తో మెరుగైన స్థితిలోనే ఉన్న టీమిండియా అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టాప్ స్కోరర్గా విరాట్ కోహ్లి (46) నిలిచాడు.

ఇక 98 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 62 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. మార్క్రమ్ (36), బెండింగ్హమ్ (7) క్రీజులో ఉన్నారు. ముకేశ్ రెండు, బుమ్రా ఒక వికెట్ తీశారు. అయితే ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో పలు రికార్డులు బద్దలయ్యాయి.
నమోదైన రికార్డులు
టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం.

దక్షిణాఫ్రికాను 55 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా రికార్డు సృష్టించింది. టెస్టుల్లో ప్రత్యర్థి జట్టును కట్టడిచేయడంలో భారత్కు ఇదే అత్యల్పం. గతంలో భారత్పై అత్యల్ప స్కోరు న్యూజిలాండ్ (62) పేరిట ఉండేది. 2021లో ముంబయిలో జరిగిన మ్యాచ్లో కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది.
153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టు స్కోరులో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది.
తొలి ఇన్నింగ్స్ 9 ఓవర్లు వేసి ఆరు వికెట్లు పడగొట్టిన సిరాజ్ రికార్డు సృష్టించాడు. ఓ భారత బౌలర్ ఆరు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు ఇంత తక్కువ ఓవర్లలో పడగొట్టడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ రికార్డు వెంటేశ్ ప్రసాద్ పేరిట ఉండేది. 1999లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 10.2 ఓవర్లలో వెంకటేశ్ ఆరు వికెట్లు పడగొట్టాడు.

సిరాజ్ మరో ఘనత సాధించాడు. తొలి రోజు లంచ్కు ముందు అయిదు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. 1987లో బెంగళూరులో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మణిందర్ సింగ్ మొదటిసారి ఈ ఘనత అందుకున్నాడు.
సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన మూడో బౌలర్గా సిరాజ్ (6/15) నిలిచాడు. శార్దూల్ ఠాకూర్ (7/61), హర్భజన్ సింగ్ (7/120) టాప్లో ఉన్నారు.