
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరు అద్భుతమని, ఆట పట్ల అతడికి ఉన్న అంకిత భావం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని దక్షిణాఫ్రికా జట్టు తాత్కాలిక కెప్టెన్ అయిడెన్ మర్క్రమ్ అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు రెగ్యులర్ కెప్టెన్ డుప్లిసిస్ గాయం కారణంగా వన్డే, టీ20 సిరిస్కు దూరమవ్వడంతో మర్క్రమ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఆరు వన్డేల సిరిస్ను కోహ్లీ సేన 5-1తో గెలుచుకుని సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జోహెన్స్బర్గ్ వేదికగా జరిగిన ఆరో వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మర్క్రమ్ మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసే చాలా నేర్చుకున్నానని తెలిపాడు.
'కోహ్లీ ఆటతీరు అద్భుతం. ఆట పట్ల అతనికి ఉన్న అంకిత భావం నన్ను ఆశ్చర్యపరిచింది. అతని పరుగుల దాహం, జట్టు విజయం కోసం అతడి తాపత్రయం బాగుంది. అందుకేనేమో కోహ్లీని ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని అంటారు. కోహ్లీతో పాటు అతని జట్టును చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు' అని తెలిపాడు.
'మణికట్టు స్పిన్నర్లు చాహల్-కుల్దీప్ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ సిరీస్ ఓటమి నాకు చాలా నేర్పింది. ఒత్తిడిని ఎలా అధిగమించి ఆడాలో తెలిసింది. ఆశించిన స్థాయిలో సిరీస్లో రాణించలేకపోయా. కెప్టెన్సీతో తీవ్ర ఒత్తిడికి గురయ్యా. అయితే, కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశాను. ఇది భవిష్యత్తులో తప్పకుండా నాకు ఉపయోగపడుతుంది' అని తెలిపాడు.